'నాన్నా, నీకు కరోనా నెగటివ్' అని అరిచిన కొడుకు.. 'పాజిటివ్' అన్నాడనుకుని కుప్పకూలి మరణించిన తండ్రి!

  • పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఘటన
  • 'సంజీవని' వద్ద పరీక్షలు
  • ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే మృతి
తన తండ్రికి కరోనా సోకలేదన్న విషయాన్ని ఎంతో ఆనందంగా చెప్పే ఉద్దేశంతో "నాన్నా నీకు కరోనా నెగటివ్ రిపోర్టు వచ్చింది" అని బిగ్గరగా అరచి చెప్పగా, విషయం అర్థం కాని ఆ తండ్రి, తనకు వ్యాధి సోకిందని అనుకుని, కుప్పకూలి మరణించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.

వివరాల్లోకి వెళితే, ఇక్కడి బడేటి వారి వీధిలో నివాసం ఉంటున్న కె.అప్పారావు (62), తన కుమారుడితో కలిసి ఇటీవల కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ 'సంజీవని' వద్దకు వచ్చి ఇద్దరూ నమూనాలు ఇచ్చారు. ఆపై రిపోర్టుల కోసం వేచి చూస్తుంటే, అప్పారావు రిపోర్టు వచ్చింది.

అతనికి కరోనా నెగటివ్ అని సిబ్బంది చెప్పగానే, ఆ విషయాన్ని కుమారుడు పెద్దగా అరిచి చెప్పాడు. విషయాన్ని అర్థం చేసుకోలేకపోయిన అప్పారావు, కుప్పకూలగా, సమీపంలోనే ఉన్న వైద్య సిబ్బంది చికిత్స చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అతన్ని అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే అతను చనిపోయినట్టు నిర్ధారించారు. ఆపై మృతదేహానికి నిన్న రాత్రి మరోసారి టెస్టులు చేయగా, కరోనా పాజిటివ్ రావడం గమనార్హం.

Corona Virus
West Godavari District
Eluru
positive
Negative

More Telugu News